రాజీ.. జీవితంలో.. Raji Life Lo

ప్రతి మనిషి తన జీవితంలో బాగా ప్రేమించిన మనిషి గురించో లేక ధ్వేషించిన వాళ్ళ గురించో మనసు పొరల్లో తేలుతూనే ఉంటుంది. ఇందులో కొన్నిఎంత వద్దనుకున్నా గుర్తుకువస్తూనే ఉంటాయి. మరికొన్ని ఆ జ్ఞాపకాల రొద మొదలైనప్పుడు తెరలు తెరలుగా గతం వైపుకు మన ప్రమేయం లేకుండానే తీసుకువెళతాయి. ఇలా ఆలోచించిన ప్రతిసారి నా మెదడులో ఓ ఆలోచనగా పుట్టి దానికి రూపాన్ని ఇస్తే అది మా రాజీ పిన్నే అవుతుంది. ఇంత బలంగా ఆమె నాలో నిలిచిపోడానికి కారణం బాల్యం అద్దిన రంగుల తెరమీద రాజీ పిన్ని జీవితాన్ని దగ్గరగా చూడగలగడమేనేమో. కాలం కొన్ని కట్టుబాట్లకు కట్టేస్తే ఆ గుంజ చుట్టూతా తిరక్కుండా.. పలుపుతాడును తెంపుకు పారిపోయిన లేగ దూడలా అనిపిస్తుంది రాజీ పిన్ని. తను అలా మనసులో మెదిలిన ప్రతిసారీ తనకూ, నాకూ జీవితం ఒకలానే రాత రాయాలనుకోవడమే నన్ను పిన్నికి దగ్గరచేసిందా అనే అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా రూపంలో కూడా మా ఇద్దరికీ పోలికలు ఉండటంతో నేను ఆమెను ఇంత దగ్గరగా తెచ్చుకోగలుగుతున్నానేమో తెలీదు.

నాలుగురోజుల క్రితం తననుంచీ వచ్చిన ఆ ఫోన్ కాల్ మళ్ళీ నన్ను రాజీపిన్ని చూట్టూ నా బాల్యాన్ని వెతుక్కునే ఆలోచనలో పడేసింది. “ ఏలా ఉన్నావే.. ఎక్కడ ఉంటున్నావ్”. ఇలాంటి కుశల ప్రశ్నలు నన్ను అడిగిన తరవాత తన గురించి మాత్రం రెండే మాటలు చెప్పింది. “జీవితంలో ఓడిపోయానే.. నాకు ఊహ తెలిసిననాటి నుంచీ కష్టపడుతూనే ఉన్నాను. ఈరోజు నా చివరిరోజులు గడిచేందుకు నాకంటూ భరోసా లేకుండా పోయింది.”. గొంతు జీరగా ఉంది. మనసులో ఎంతో బాధ లేకపోతే తను అలా మాట్లాడదని నాకు తెలుసు. “సరే పిన్ని.. నువ్వేం కంగారు పడకు… వీలైతే ఈసారి వచ్చినపుడు నిన్ను తప్పకుండా కలుస్తాను”.. కాస్త అవీ ఇవీ మాట్లాడి ఫోన్ పెట్టేసాను.

పిన్నిని చూసి దాదాపు ఎనిమిదేళ్ళు అవుతుంది. కాకినాడలో రెండు నెలల క్రితం వాచ్ షాపుకి వెళ్ళినపుడు రాజీపిన్ని అల్లుడిని చూసాను. “ఏలా ఉన్నారంటూ” అతనే చొరవగా నన్ను పలకరించాడు. మొదట గుర్తుపట్టలేదు. నెమ్మదిగా మాటల్లో రాజీపిన్ని గురించి చెప్పుకొచ్చాడు. ఆరోగ్యం ఏం బావుండటం లేదని.. కుట్టుపని ఇప్పుడు చేయలేకపోతుందని. వీలైతే వచ్చి కలవమన్నాడు. నేను వచ్చిన కారణం వేరుకావడంతో ఆరోజు పిన్నిని కలవకుండానే తిరిగి ఊరికి వచ్చేసాను. అతనికి మాత్రం రాజీపిన్నికి నా నంబర్ ఇచ్చి ఫోన్ చేయించమని చెప్పాను. ఈరోజు పిన్నితో మాట్లాడితే కళ్ళ ముందు మళ్ళీ నాకు తెలిసిన చిన్ననాటి రాజీ రూపం కదిలింది. వెలుతురంటూ చొరబడని, ఫేనుగాలి తప్ప మరో మార్గంలేని ఈ గదిలో.., సమయంతో పనిలేని నా మెదడు చేస్తున్న ఆలోచనల రొదకు ఆ ఉదయం రాజీపిన్ని మాటల వెనుక కన్నీటి నిట్టూర్పుల కథను వెతుక్కుంటూ వెళుతున్నాను.

నా మనసు పొరల్లో ఆమె రూపం కాలానికి తగ్గట్టు మార్పులు సంతరించుకోలేదు. ఇంకా ఆ ముఖానికే అందాన్ని తెచ్చే తనవైన పెద్ద కళ్ళతో రాజీ పిన్నికే సొంతమైన సిరినవ్వుతో నా ఊహలో నిలిచిపోయింది. గిరజాల జుట్టు, నీలి కళ్ళు, శంఖం లాంటి మెడ.. ఒళ్ళంతా నున్నటి నూగు, పెద్ద కళ్ళతో అచ్చం ఒకప్పటి సినిమా హిరోయిన్ లా ఉంటుంది రాజీ. మనిషి చలాకీగా.. మెరటుగా కనిపిస్తుంది కానీ మనసు చాలా సున్నితం. చిన్నాళ్ళకు పెద్దాళ్ళకూ అందరికీ తను రాజీనే. రాజీపిన్నికి నాకు వయసులో మరీ అంత వ్యత్యాసం ఉండదు.. మహా అయితే ఓ పదేళ్ళు పెద్దదేమో.. ఇప్పటి వరకూ నేను చూసిన అందగత్తెలందరి కన్నా ముందువరసలో ఉంటుంది రాజీ. నా బాల్యానికి తన యవ్వనానికి లంకవేసి ఎన్నో ఆటలు ఆడుకున్నాం.

తను లంగా ఓణీలు కట్టే నాటికి నేనింకా గౌనుల్లో చిన్నపిల్లనే.. ఒకసారి కోతులు వచ్చి పెరట్లో చెట్లమీద చేరి కాయలన్నీ తెంపి అల్లరి చేస్తున్నాయి. రాజీ కూడా నేనూ వాటిని అదిలించాలని వెళ్ళాను. నారింజ చెట్టు మీద నుంచీ ఓ పెద్ద కోతి నా మీదకు ఉరికింది. భయంతో గట్టిగా కేకపెట్టి రాజీ చంక ఎక్కేసాను. నా భయాన్ని చూసి విరగబడి నవ్వింది.., అచ్చం ఇప్పటి నా నవ్వులా.. , ప్రతివారం ఇంటిపని అయిపోయాకా ఇద్దరం కుట్టిన పార్టీ జండాలను అప్పగించడానికి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. దారంతా బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. తిరిగి వచ్చేటప్పుడు బెల్లం జిలేబీ కొనిపెట్టేది. అంతదూరం నడకలో ఉన్న అలసటంతా జిలేబీని చూసేకా పోయేది నాకు. ఓరకంగా ఆ జీలేబీ కోసమే తనతో వెళ్ళేదాన్నేమో..

ఓసారి కటార్ నగర్ దాటి, తిలక్ రోడ్డులోకి వెళ్ళాకా ఇద్దరు అబ్బాయిలు మా వెనకే వస్తున్నారు. రాజీ వాళ్ళను గమనించినా గమనించనట్టు నాతో మాట్లాడుతుంది. వెనక వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. నేను తలతిప్పి చూస్తే సైకిల్ ఆపేసి మాట్లాడుకుంటున్నారు. సగం దూరం అలాగే వచ్చేసాం. ఇద్దరిలో ఒకడు మాకన్నా ముందుకి వచ్చి సైకిల్ ఆపాడు. రాజీ కళ్ళు పెద్దవి చేసింది. అప్పటివరకూ నాతో నవ్వుతూ మాట్లాడినదల్లా.., ముఖంలో ఎంతో కోపాన్ని తెచ్చి పెట్టుకుంది. రాజీ వాడికి దగ్గరగా వేళ్ళి సైకిల్ హేండిల్ పట్టుకుని నోటికొచ్చినన్ని తిట్లూ తిట్టేసింది. నా చెయ్యి గట్టిగా పట్టుకుంది పరుగులాంటి నడకతో అక్కడి నుంచీ వచ్చేసాం. నేను ఇంకా చిన్న పిల్లనే కావడంతో ఇదేదో ఆటలా అనిపించింది నాకు.

మా ఇద్దరికీ ఉన్న వయసు వ్యత్యాసం తనను నా నుంచీ దూరం చేసింది. రాజీ మీదకు ఒక్కసారిగా వచ్చిపడిన పెళ్ళి పిల్లలు బాధ్యతల మధ్య జీవితంతో పోరాడుతూ నాకు దూరంగా జరిగిపోయింది. వాటిలో పడి నాతో కలిసి ఆడిన ఆటలన్నీ మరిచిపోయింది. కానీ ఎప్పుడన్నా కనిపిస్తే తను ఏది వండుకుంటే ఆ కూరే వేసి ఆప్యాయంగా అన్నం పెట్టేది. అమ్మ తర్వాత అమ్మలా. ఎప్పుడూ వరసకదా అని పిన్ని అని పిలవలేదు. కాస్త పెద్దయ్యాకా రాజీపక్కన పిన్ని అని తగిలించాను గానీ తను ఉత్తరాజీగానే దగ్గరగా అనిపిస్తుంది.

రాజీ చిన్నతనం నుంచే కష్టపడటం అలవాటు చేసుకుంది. తన ఈడువాళ్ళు రెండు జడలేసుకుని, తలనిండా పూలు సింగారించి, పావడా కట్టుకుని ఆటలాడుకుంటూంటే… రాజీపిన్ని కుట్టు పనిలో మునిగిపోయేది.. మా తాత సంపాదించి తెచ్చేది తన తాగుడికే సరిపోయేది కాదు. ఇక కుటుంబ భారాన్ని ఉన్న ఇద్దరు ఆడపిల్లలు పంచుకున్నారు. పార్టీ జండాలు, లంగాలు, రేడీమేడ్ గౌనులు కుట్టి షాపులకి వేసే పని. రోజంతా కుడితే వందరూపాయలు వచ్చేవి. అవే ఐదుగురు పెద్దవాళ్ళకీ సరిపెట్టాలి. మా అమ్మ పెళ్ళి వయసు దాటకుండానే పెళ్ళి చేసుకుని ఇల్లు దాటి వచ్చేసింది కానీ.. రాజీ పిన్నికి చాకిరీ తప్పింది కాదు. తన ఈడువాళ్ళకు పెళ్లిళ్ళయ్యి అత్తారిళ్ళకు వెళిపోతున్నా.., అక్కకు బిడ్డలు పుట్టేసినా తనింకా ఇంటి భారాన్ని మోస్తూనే ఉండిపోయింది. ఎన్ని సంబంధాలు వచ్చినా కట్నాలు ఇచ్చుకోలేమని.., కూతురికి పెళ్ళి చేసేస్తే ఉన్న సంపాదన పోతుందని వచ్చిన సంబంధాలను తాతే వెనక్కి పంపేస్తున్నాడని తెలిసినా.., రాజీపిన్ని మౌనంగానే ఉండిపోయింది.

ఓ సాయంత్రం వేళ అమ్మమ్మతో చిన్న తగాదా పెట్టుకుని పక్కింటికి వెళ్ళిన రాజీ తన జీవితం గురించి మొదటిసారి ఆలోచించుకుంది. వారం క్రితం రెండో పెళ్ళి చేసుకుంటానని రాయబారం పంపిన రంగనాథ్ ను పెళ్ళాడాలని తీర్మానించుకుంది. అనుకున్నట్టుగానే ఇద్దరూ గుళ్ళో పెళ్ళి చేసుకుని ఇంటికి వచ్చారు. ఈ పెళ్ళి అమ్మమ్మతో సహా ఎవరికీ నచ్చలేదు తల్లి కనుక అమ్మమ్మ బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంది కానీ తాత పట్టుదలతో జరగాల్సిన ముచ్చట్లేం జరగలేదు.

రాజీ పెళ్ళయి నాలుగు నెలలు.. తను కొత్తకాపురానికి కావలసినవన్నీ అమర్చి మంచి ముహుర్తం చూసి అత్తారింటికి పంపేంత శ్రద్ధ ఆ ఇంట్లో ఎవరికీ లేదు. అందుకేనేమో తనే ఈ నాలుగు నెల్లో నాలుగైదుసార్లు అక్కడికి వెళ్ళి వచ్చింది. చిన్నాన్న తననుకున్నంత మంచోడు కాదని నెమ్మదిగా తెలుసుకుంది. ఇదంతా తనకు తెలిసేలోపు చిన్న చెల్లి వచ్చేసింది నేను ఆడుకోడానికి. సంవత్సరన్నరలో పదిమార్లు గిల్లికజ్జాలు ముదిరి చిన్న కొట్లాటల వరకూ చేరాయి. తను అత్తింటికి, పుట్టింటికీ తిరగటం మొదట్లో కొత్తనిపించినా నెమ్మదిగా “ఆ… ఎన్నిరోజులుంటుదిలే అక్కడ.. మళ్ళీ రెండురోజుల్లో వచ్చేస్తుందిగా అనే సులువైన అభిప్రాయం ఏర్పడిపోయింది మా అందరికి.

నాలుగేళ్లకు ముగ్గురు ఆడబిడ్డలకు తల్లయింది. ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, వంశాన్ని కాపాడే కొడుకు పుట్టనందుకు రోజుకో వంకతో రాజీని కొట్టి, అందినచోటల్లా కొరికి ఒళ్ళు గుల్లచేసి పంపేవాడు చిన్నాన్న. ఎందరు చెప్పినా తగాదాలు ముదిరేవేగానీ.. సర్దుకునేవేకాదు. ఇదంతా తనకూ త్వరగానే అలవాటైపోయిందో లేదా అలవాటు చేసుకుందో తెలీదుకానీ.. మరీ బెంగలో కనిపించేది కాదు రాజీ.

తాగుడు, జూదానికి బానిసై ఉన్నదంతా పోగొట్టుకున్న చిన్నాన్న వ్యాపారం మొత్తం దివాళాతీసింది. భార్య,ముగ్గురు పిల్లలను పోషించే బాధ్యత నెత్తిన వేసుకునే ధైర్యం చాలక ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి పారిపోయాడు. చిన్నాన్న వస్తాడని ఎదురుచూసి రాజీపిన్ని ముగ్గురు బిడ్డలతో చిన్న ఇంట్లో మిగిలిపోయింది. కుటుంబం గడవడానికి మళ్ళీ కుట్టుమిషనే ఆధారం అయింది. భర్త ఎక్కడో ఉన్నాడని కబురందిన ప్రతిసారి నన్ను వెంటబెట్టుకుని వెళ్లి వెతికి వచ్చేది. తీరా చిన్నన్న కాదని తెలిసి కన్నీళ్ళు పవిట చెంగుతో అద్దుకుంటూ.. రేపు కుట్టి ఇవ్వాల్సిన బట్టలు ముందేసుకుని పనిలో పడిపోయేది. కొన్నాళ్ళకు చిన్నాన్న గుండెపోటుతో చనిపోయాడనే వార్త చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ వార్త అందరినీ బాధించినా పిన్నిలో ఏ మార్పునీ తీసుకురాలేకపోయింది. అప్పటికే చిన్నాన్న లేకుండా కుటుంబాన్ని పోషిస్తూ.. ముగ్గురు బిడ్డల్ని సాకుతూ జీవితాంతం అలానే ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంది. కనుక అతను ఇకలేడన్న వార్త రాజీని మరీ బాధించలేదు.

ఒంటరిగా భర్త సాయం లేకుండా ముగ్గురు బిడ్డలతో నెట్టుకొస్తున్న రాజీ మీద జాలి చూపించేవాళ్ళు ఎక్కువైపోయారు. చుట్టాల్లోనూ, తెలిసివవాళ్లలోనూ పిన్ని అందానికి మనసు పారేసుకుని పెళ్లయిందని వెనక్కు తగ్గిన వారంతా రాజీని పెళ్లిచేసుకుంటామని అమ్మమ్మకి రాయబారాలు పంపేవారు. కూతురు జీవితం బాగైపోతుందని, ఆశపడే ప్రతి తల్లిలాగే ఆలోచించే అమ్మమ్మ వాళ్ళను ఆదరించేది. రాజీకి జీవితం మీద ఎక్కడలేని ఆశనూ కల్పించిన వాళ్లు ముగ్గురు బిడ్డల పోషణ మాత్రం తమ వల్లకాదనే సరికి వ్యవహారం మళ్లీ వెనక్కు వచ్చేది.

మా అమ్మనాన్నా, మేనమామా అంతా ఆమెకు కుటుంబం గడవడానికి వ్యాపార మార్గాలు చూపించాలనుకున్నారు కానీ రాజీకి మళ్ళీ పెళ్ళి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఒక్కరూ ఆలోచించలేకపోయారు. అమ్మమ్మ మాత్రం తన చిన్న కూతురు జీవితాన్ని మళ్లీ చిగురింపచెయ్యాలని చాలా ప్రయత్నాలు చేసింది. ముగ్గురు బిడ్డల్నీ తను పెంచుకుంటానని మోతుబరి సూర్రావు సంబంధం ఖాయం చేసింది. ఇంట్లో వాళ్ళు కులం కట్లు బాట్లు పేర్లతో ఈ పెళ్ళికి ఒప్పుకోరని తిరుపతి తీసుకువెళ్లి రహస్యంగా పెళ్ళి చేయించి తీసుకువచ్చింది.

విషయం తెలిసి తాత వచ్చిన కోపాన్ని అమ్మమ్మ మీద తీర్చుకున్నాడు.ఇద్దరికీ పెద్ద గొడవైంది. ఇంటి పరువు పోతుందని మావయ్య రాజీని ఇక పుట్టిల్లు ఉన్న మాట మరిచిపోమన్నాడు. కానీ బిడ్డల పెంపంకం బాధ్యత మాత్రం తీసుకుంటానన్నాడు. కన్నీళ్ళు పెట్టుకున్న రాజీ సూర్రావు చిన్నాన్నతో కొత్త కాపురానికి ప్రయాణమయ్యింది. ఇద్దరూ కొత్తూరులో కొత్తకాపురం పెట్టారు. అరిటి గెలల వ్యాపారంలో బాగా సంపాదించిన సూర్రావు చిన్నాన్నకి భార్య చనిపోయి పదేళ్ళు దాటింది. ఊళ్ళో తాతల నాటి పెద్ద ఇల్లు, ఇద్దరు మగ సంతానం ఉన్నారు. ఇద్దరూ దాదాపు రాజీపిన్ని వయసు వాళ్ళే.. పెళ్ళి వయసు దాటిపోతున్న కొడుకులకు పెళ్ళి చేయకుండా తండ్రి రెండో పెళ్ళి చేసుకురావడం వాళ్ళకు సుతరామూ నచ్చలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. రాజీ వెళ్ళి సంసారాన్ని రెండుగా చీల్చేసిందని సుర్రావు చిన్నాన్న చుట్టాలంతా రాజీని ఎవరిళ్ళకీ రానీయ లేదు. అయిన వాళ్ళందరినీ, కన్న బిడ్డల్ని వదులుకుని చేసుకున్న ఈ పెళ్ళి ఎవరికోసమో రాజీకి అర్థం కాలేదు.

సంవత్సరం బాగానే సాగిన రాజీపిన్ని జీవితం మళ్ళీ చిక్కుల్లో పడింది. సూర్రావు చిన్నాన్న లోడుతీసుకువెళ్లి తిరిగి వస్తుండగా రావులపాలం వంతెన మీద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్నాన్న కొడుకులు తండ్రిని చంపేసిందని, నష్టజాతకురాలని ఇంట్లోంచి గెంటేసారు. మళ్లీ రోడ్డున పడ్డ రాజీ దొంగతనంగా అమ్మమ్మను కలుసుకుంది. అప్పుడే సెలవులకని అమ్మమ్మ ఇంటికి వచ్చిన నాకు రాజీ పిన్నిని చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మనిషి చాలా చిక్కిపోయి నీరసంగా తయారయింది. నాతో కలిసి ఆడుకున్న చిలిపితనం కానీ, చలాకితనం కానీ తనలో ఎక్కడా కనిపించలేదు. మనిషి పూర్తిగా నాకు తెలిసిన రాజీలానే అనిపించలేదు. మాట తీరు కూడా పూర్తిగా మారిపోయింది.

అక్క భారం మీద వేసుకోవడం ఇష్టం లేని మావయ్య బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపొమ్మన్నాడు. అమ్మ మాత్రం రాజీ పరిస్థితికి జాలి పడింది. మాతో పాటు మేడపాడు తీసుకువచ్చింది. తెలిసివాళ్ళను అడిగి కుట్టు మిషను పెట్టుకోడానికి షాపు ఇప్పించింది. కొన్నిరోజులు మా పక్క వాటాలోనే అద్దెక్కున్న రాజీ…, ఉదయమంతా కుట్టుపని చూసుకుని సాయంత్రనికి షాపు నుంచీ తిరిగి వచ్చేది. పిల్లలు అప్పటి వరకూ మా ఇంట్లోనే ఆడుకునేవాళ్ళు.

వారం అంతా పనిలో ఉన్నా..ఆదివారాలు షాపు మూసేసి ఇంట్లోనే మాతో ఉండేది. పక్కనే ఉన్న పిల్లకాలవలో స్నానానికి వెళ్ళేవాళ్ళం. పెద్దగా నీళ్ళు పారని పిల్ల కాలవలో చిట్టి చేపలు పోతూ ఉండేవి. మోకాళ్ళ వరకూ చీరను ఎగ్గట్టి కాలవ గట్టుకిందకి దిగి నాచుపట్టిన మెట్ల మీద చెల్లిని కూచోపెట్టి ఇద్దరం ఈత కొట్టేవాళ్ళం. ఆ పక్కనే స్నానాలు చేసేవాళ్ళంతా మమ్మల్ని చిత్రంగా చూసేవాళ్లు. రాత్రికి ఆరు బయట పిల్లలు పెద్దాళ్లు అంతా చేరి సినిమా పాటలు పాడేవాళ్ళం. వండుకున్న వంటలన్నీ ఆ వెన్నెల్లో చాపలు పరుచుకుని తినేవాళ్ళాం. మడతమంచాలు ఆరుబయట వేసుకుని పడుకునేవాళ్ళం. చాలా రోజుల తరవాత రాజీ వచ్చాకా సరదాకా గడుస్తున్నరోజులు నాకు కొత్తగా అనిపించాయి. తనని వదిలి బడికి వెళ్ళాలనిపించేది కాదు. మనసంతా ఎప్పుడు ఆదివారం వస్తుందా అనే ఉండేది.

raji

ఊళ్ళో వాళ్ళు కొత్తగా వచ్చిన రాజీ గురించి అమ్మని ఆరాలు అడగటం మొదలు పెట్టారు. అమ్మకూడా నెమ్మదిగా రాజీ అందం తన సంసారానికి అడ్డు పడుతుందనే ఆలోచనకు వచ్చేసింది. ఊరి వాళ్ళను అడిగి పోరంబోకు స్థలంలో చిన్న పాక వేయించి అక్కడ కాపురం పెట్టించింది. మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయిన రాజీపిన్ని చూట్టూ మగ తుమ్మెదల వేట మొదలైంది. ఎన్నని తప్పించుకుంటుంది. వయసులో ఓ మగవాడితోడుతో సంసారాన్ని, వయసు భారాన్ని పొదిమి పట్టుకోవలసిన తన జీవితం రోడ్డు మీద పూరింట్లో ముగ్గురు బిడ్డలతో మిగిలిపోయింది.

అక్కడే రైస్ మిల్లులో పనిచేసే సత్తిరాజుతో పరిచయం అయ్యింది. ఆప్యాయత కోసం ఎదురుచూస్తున్న రాజీపిన్నికి సత్తిరాజు మాటలు మనసుకు దగ్గరగా అనిపించాయి. అతనికి పిల్లలంటే ఉన్న ప్రేమ తండ్రి ప్రేమగా మారుతుందనుకుంది. కొన్నిరోజులకి సొంతూరు వెళ్లి వస్తానని వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగిరాలేదు. ఇలా తన జీవితంలో పరిచయమైన ప్రతి మగడిలోనూ ప్రేమను వెతుక్కుని చివరికి అది దక్కక ఆ ప్రేమలో ఉన్న ఆకర్షణలోపడి తాత్కాలమైన ఆనందాన్ని అందుకున్నా, తిరిగి తన చుట్టూ ఉన్న కుటుంబ బాధ్యత చట్రంలో ఇరుక్కుపోయేది.

అప్పుడు ఇప్పుడు తనకంటూ మిగిలింది ఆ కుట్టుమిషనే. కుట్టు మిషను ఆడితేనే తన జీవితం నడుస్తుందనే సత్యాన్ని అర్థం చేసుకోడానికి చాలా సమయం పట్టింది రాజీకి. తన జీవితంలోకి ఎందరు వచ్చినా తనకి పూర్వపు రోజులు తీరిగొచ్చినట్టు మురిసిపోయినా మళ్ళీ అవన్నీ చేజారిపోయినప్పుడు ఆ నిరాశ నుంచీ పైకిలాగి కడుపునింపే ఆధారం కుట్టు మిషనే అయ్యేది. అప్పుడు కూడా మేము ఉన్నామని అయినవాళ్ళ ఆసరా రాజీకి అందలేదు. తన జీవితంలోకి వచ్చి వెళ్లిన ప్రేమల తాలుకు జ్ఞాపకాలు రాజీకి లేకపోయినా వాటిని ఇంకా గుర్తుచేస్తూ రాజీని తప్పుచేసిన దానిలా నిలబెట్టారు. ఈ నిందలు రాజీని అయినవాళ్ళందరికీ దూరంగా.., ఎవరికీ తెలియకుండా ఎక్కడో దూరంగా బ్రతికేలా తరిమేసాయి.

మాకు దూరంగా ఎక్కడెక్కడో తన బిడ్డలతో బ్రతికింది. ఎప్పుడన్నా అమ్మమ్మ ఎవరికీ తెలియకుండా వెళ్ళి రాజీని కలిసి వచ్చేది. తను ఎక్కడ ఉంటుందో ఏలా ఉందో ఎవరికీ వివరాలు అవసరం లేకపోయింది. చివరికి తాత పోయినప్పుడు రాజీని శవాన్ని చూడడానికి రానివ్వాలని అమ్మమ్మ పట్టుబట్టింది. లోపల రాజీ మీద ఉన్న వ్యతిరేకతనంతా ఆ సమయంలో బయటపెట్టి రచ్చచేయడం ఇష్టంలేని మావయ్య అందుకు ఒప్పుకున్నాడు. రాజీ ఎక్కడ ఉంటుందో అమ్మమ్మకు మాత్రమే తెలుసు. తనే కబురుపెట్టింది. సాయంత్రం అయిపోతుందనగా ఆటోలో పిల్లలతో దిగింది రాజీ. బాగా ఎడిచి ఉబ్బిన కళ్ళతో… తాత బ్రతికున్నంత వరకూ రాజీని చీడపురుగులానే చూసాడు. అయినా ఆ శవం మీద ఎంతో ప్రేమగా పడి ఏడిచింది రాజీ. మనవలం అంతా ఓ మూలకి వాలిపోయి ఉన్నాం. రాజీ పిల్లలు బిక్కుబిక్కుమని చూట్టూ జరుగుతున్నది చూస్తున్నారు. అప్పటికే సమయం అయిపోవడంతో తల దగ్గర పెట్టిన అగరబత్తిలను పక్కకు తీసి శవాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేం పట్టించుకోనే తెలివిలో లేని రాజీ కడుపులో పేగులు తెగేలా పెద్దగా ఏడుస్తూనే ఉంది. అందరం స్నానాలు చేసాకా రాజీ తడిజుట్టు ముడివేసుకుని మౌనంగా అమ్మమ్మ ఉన్న మూల గదిలోకి వెళ్ళి తనతోనే పడుకుంది ఆ పదిరోజులూ.

తాతపోయినప్పుడు చూసిన రాజీని మళ్ళీ నా పెళ్ళినాడు చూసాను. కళ్యాణమండపానికి వచ్చేసాకా గదిలో ఉన్న నాకు ఎవరో చెప్పారు రాజీ పెళ్ళికి వచ్చిందని. ఆమాట ఎంతో సంతోషాన్ని నింపింది. చెల్లితో కబురుపంపాను. అయినా తను నన్ను చూడడానికి రాలేదు. మనసు చివుక్కుమంది. తన పిల్లలను తీసుకుని పెళ్లి తంతు జరుగుతున్న మండంపంలో ఎక్కడో మూలగా కూర్చుంది. మామూలుగా అయితే రాజీ ఎంతో సంబరంగా నాతో పాటు నాపక్కనే మండపంలో ఉండాల్సింది. అందరూ అక్షింతలు వేయడం అయ్యాకా నాదగ్గరకి వచ్చింది. మనిషి పూర్తిగా మారిపోయింది. మునుపటి రంగులేదు. బాగా ఒళ్ళు చేసింది. ఎంతో దుఖాఃన్ని తన కళ్ళల్లో దాచుకుని నావరకూ వచ్చిందేమో.. నన్ను ప్రేమ నిండిన కళ్ళతో చూసింది. నేనూ లోపలినుంచీ తన్నుకువస్తున్న ఆప్యాయతతో కూడిన కన్నీళ్ళను అతి కష్టం మీద ఆపుకోగలిగాను. అయితే ఆరోజు రాజీతో ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయాను.

ఈలోపు నా జీవితంలో వచ్చిన చాలా మార్పులు నన్ను నావాళ్ళకు దూరం చేసాయి. అందరినీ ఎదిరించి నేనుగా రాసుకున్న నా తలరాత పుట్టింటి నుంచీ నన్ను నెట్టేసింది.. నా అన్నవాళ్ళకు దూరంగా బ్రతుకుతున్న నాకు దాదాపు ఎనిమిదేళ్ళకు మళ్ళీ రాజీ గొంతు వినిపించింది. త్వరలో తనని మళ్ళీ కలవబోతున్నాను. ఏమో ఇప్పటి రాజీ నాకు తెలిసిన బాల్యంలోని అందాల బరిణ రాజీలా నన్ను దగ్గరగా కూచోపెట్టుకుని అన్నం పెడుతుందో.. లేక అందరూ అడిగినట్టు ఎందుకు దూరంగా వెళిపోయావని నిలదీస్తుందో. ఇప్పుడున్న రాజీ కాలం నేలరాసిన ఎన్నో తలరాతల జాబితాలో చేరిపోయిన ఓ కథగా మాత్రమే మిగిలిపోతుందో తెలీదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *